Sunday, July 31, 2016

మధుమేహానికి ప్రధాన కారణాలు

              నగరీకరణ, ఆహారంలో మార్పులు, జీవన ప్రమాణం పెరగడం, వ్యాయామం లేకపోవడం మధుమేహానికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. మధుమేహం ఇటీవల కాలంలో మన దేశంలో బాగా పెరిగినట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. మన రాష్ట్రంలోనూ, దేశంలోనూ చాపకింద నీరులా మధుమేహం వ్యాప్తి చెందుతోంది. ప్రపంచానికే మధుమేహ రాజధానిగా మన దేశం నిలవబోతుందనడంలో నిజం లేకపోలేదు. సుమారు 50 మిలియన్లకుపైగా ఇప్పటికే మన దేశంలో మధుమేహం బారినపడ్డారని, ఈ సంఖ్య 2030 నాటికి 80 మిలియన్లకు పెరగవచ్చని ఆరోగ్య నిపుణుల అంచనా. నష్టం జరిగిన తరువాతగానీ దీని అసలు రూపం బయటపడదు. కాబట్టి దీనిని సైలెంట్‌ కిల్లర్‌ అంటారు. ఈ నెల 14న 'ప్రపంచ మధుమేహ దినోత్సవం' సందర్భంగా పాఠకుల అవగాహన కోసం ఈ వ్యాసం. మధుమేహం ఉందన్న సంగతి 50 శాతం మందికి పైగా వ్యాధిగ్రస్తులు గుర్తించ లేకపోతున్నారు. తెలుసుకున్న వాళ్లలో 50 శాతం మంది మాత్రమే తగిన వైద్యాన్ని తీసుకొంటున్నారు. మధుమేహం వలన నరాలు, గుండె, ఊపిరితిత్తులు, రక్తనాళాలు, మూత్రపిండాలు, కళ్లు, పాదాలు వంటి ఎన్నో అవయవాలు దెబ్బతింటాయి. కాబట్టి మధుమేహం గురించి అందరూ తప్పనిసరి తెలుసుకుని, దాని నుండి రక్షణ పొందాల్సిన అవసరం ఉంది. 
కారణాలు
కుటుంబంలో తల్లిదండ్రులకు మధుమేహం ఉన్నా, అధికబరువు, ఊబకాయం ఉన్నవారికి, ఎక్కువ శ్రమలేని జీవితాన్ని గడుపుతున్న వారికి, ఎక్కువ ఒత్తిడికి గురవుతున్న వారికి ఈ మధుమేహం వచ్చే అవకాశం ఉంది. కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిజరైడ్‌ స్థాయి ఎక్కువగా ఉన్నవారు, నాలుగు కిలోల బరువున్న శిశువులకు జన్మనిచ్చిన స్త్రీలు, స్టెరాయిడ్స్‌ తీసుకునే వారికి రావచ్చు. తల్లిదండ్రులిద్దరికీ మధుమేహం ఉంటే 99 శాతం వారి పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులలో ఒకరికి మధుమేహం ఉండి రెండోవాళ్ల బంధువుల్లో ఎవరికైనా మధుమేహం ఉంటే 75 శాతం వచ్చే అవకాశం ఉంది. బంధువులు ఎవరికైనా మధుమేహం ఉంటే 50 శాతం, తల్లిదండ్రులకు కాకుండా దగ్గర బంధువుల్లో ఎవరికైనా మధుమేహం ఉంటే 25 శాతం మందికి వస్తుందని వైద్యులు చెబుతున్నారు.
పరీక్షలు 
మధుమేహం నిర్ధారణకు సంబంధించి ఈ కింది పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి. ఫాస్టింగ్‌, పోస్ట్‌ లంచ్‌ బ్లడ్‌ షుగర్‌ ప్రతి నెలా చేయించుకోవాలి. గ్లైకోజిలేటెడ్‌ హెమోగ్లోబిన్‌ (హెచ్‌బిఎ1సి) టెస్ట్‌లు రెండు మూడు నెలలకు ఒకసారి చేయించుకోవాలి. లిఫిడ్‌ ప్రొఫైల్‌ సంవత్సరానికి ఒకసారి, కిడ్నీ పరీక్షలు యూరియా, క్రియాటినైన్‌ ఆరు నెలలకు ఒకసారి, మెక్రో అల్బుమిన్‌ సంవత్సరానికి ఒకసారి, గుండె, లివర్‌, పాదాలను సంవత్సరానికి ఒకసారి పరీక్ష చేయించుకోవాలి. కన్ను రెటీనా గురించి పరీక్షలు సంవత్సరానికి ఒకసారి చేయించుకోవాలి. బ్లడ్‌ షుగర్‌ పరీక్షలతో పాటు ప్రతి సంవత్సరం కళ్లు, కిడ్నీలు, గుండె, కాలేయం, నరాలు, పాదాల పరీక్షలను చేయించుకుంటూ జాగ్రత్తలు తీసుకోవాలి. 
లక్షణాలు
తరచుగా మూత్ర విసర్జన చేయడం, అతిగా దాహం, ఆకలి వేయడం, బరువు తగ్గిపోవడం, చూపు మందగించడం, పుండ్లు త్వరగా మానకపోవడం, బాగా నీరసం, నిస్సత్తుగా ఉండటం, మర్మావయవాల వద్ద ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్స్‌ రావడం వంటి లక్షణాలు ఉంటాయి.

No comments: