Sunday, July 31, 2016

దేశంలో తీవ్ర సమస్యగా మధుమేహం

                      మధుమేహం ప్రపం చాన్ని భయపెడుతోంది. అది అత్యంత వేగంగా పెరుగు తున్న దేశాల్లో భారతదేశం అగ్రస్థానంలో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలో పెరుగుతున్న ఈ సమస్య తీవ్రతను పరిగణనలోకి తీసు కొని ఈ ఏడాది మధుమేహాన్ని తరిమికొడదామని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) పిలుపునిచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా 35 కోట్ల మంది మధుమేహం బారిన పడ్డారు. మరో 20 సంవత్సరాలలో ఈ సంఖ్య రెట్టింప వుతుందని డబ్ల్యుహెచ్‌ఒ హెచ్చరిం చింది. 2012లో కోటిన్నరమంది కేవలం మధు మేహం వల్లే మరణించారు. ఇందులో 80 శాతం అల్ప, మధ్యా దాయం గల దేశాల్లోనే ఉంది. 1990 నుంచి 2013 వరకు ప్రపంచ వ్యాప్తంగా మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య 45 శాతం పెరిగితే భారత్‌లో అది 123 శాతమని వాషింగ్టన్‌ విశ్వ విద్యాలయానికి చెందిన పరిశోధ కులు చేసిన ఓ అధ్యయనం తేల్చింది. స్థూలకాయం, నిద్ర లేమి, మూత్రపిండాల జబ్బు లు, పక్షవాతం, గుండెపోటు వంటి పలురకాల వ్యాధులకు కారణమయ్యే పది అంశాలలో మధుమేహం కూడా చేరింది. 1990లలో తొలి పది వ్యాధుల జాబితాలో లేని మధుమేహం 2013 నాటికి 8వ స్థానంలో నిలిచింది.
దేశంలో తీవ్ర సమస్యగా మధుమేహం
మన దేశం 'ప్రపంచ మధుమేహ రాజధాని 'గా మారిం ది. భారత్‌లో అకాల మరణాలకు చాలా వరకు మధుమేహం, రక్తపోటు లాంటి సాంక్రమికేతర వ్యాధులే కారణమవుతున్నా యని ప్రపంచబ్యాంకు విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. 2011 అంచనాల ప్రకారం 20-79 సంవత్సరాల వయస్సు కలిగిన 6,13,00,000 మంది ప్రజల్లో మధుమేహం ఉంది. ఇది 2030 నాటికి 10,12,00,000 చేరుకుంటుందని అంచనా. మారుతున్న జీవనశైలిలో భోజనపు అలవాట్లు దీనికి కారణమౌతున్నాయి. వంశపారంపర్యం, జన్యు సంబం ధిత అంశాలు, వ్యాయామం లేకపోవటం, వయసు పైబడ టం లాంటి అంశాలు మధు మేహాన్ని వ్యాపింపజేస్తున్నాయి. 2001లో ఢిల్లీ, కోల్‌కతా, ముంబాయి, బెంగళూరు, చెన్నరు, హైదరాబాద్‌లలో 'నేషనల్‌ అర్బన్‌ డయాబెటిక్‌ సర్వే' జరి గింది. దీని ప్రకారం 2001లో దేశంలో మధుమేహ సగటు 12 శాతంగా ఉంది. ముంబాయి, ఢిల్లీలో 9 శాతం ఉంటే దక్షిణభారత దేశ నగరాలలో 13-15 శాతం ఉంది. అంతే కాక ఆరు మెట్రో నగరాలలో హైదరాబాద్‌లోనే ఇది ఎక్కువ. ఇక్కడ సగటు మధుమేహం 16 శాతం వుంది. ముఖ్యంగా పట్టణ పేదలలో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంది. ప్రతి నలుగురు పట్టణ పేదలలో ఒకరికి మధుమేహం ఉంది.
రెెండు తెలుగు రాష్ట్రాల్లో...
రెెండు తెలుగు రాష్ట్రాల్లో మధుమేహం ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. మన విద్యావ్యవస్థ కూడా రోగాలకు కారణమౌతోంది. పిల్లలు అందమైన బాల్యాన్ని, ఆటపాటలను పూర్తిగా కోల్పోతున్నారు. వాటి స్థానే ఎంతసేపూ చదువు, హోంవర్కులు, ట్యూషన్లు లేదా టీవీ, కంప్యూటర్లు చూడటంతోనే బాల్యం గడిచిపోతోంది. ఇక ఇంటర్మీడియెట్‌ విద్యావిధానం కట్టుబానిసత్వానికి ప్రతీక. తల్లిదండ్రులు ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ విధానాన్ని సమర్థించి ఆచరిస్తున్నారు. ఈవిధానం విద్యా ర్థుల్లో అపరిమితమైన మానసిక ఒత్తిడి, అభద్రతాభావం, అనారోగ్యకరమైన పోటీతత్వం పెంపొందిస్తున్నాయి. ఒక వైపు పోషకాహారం అందక కోట్ల మంది బాలలు బక్కచిక్కి పోతున్న దేశంలోనే స్థూలకాయంతో అవస్థలు పడుతున్న వారి సంఖ్య పది శాతం దాటిపోయి మరింత వేగంగా పెరుగుతున్న తీరు భయాందోళనలను కలిగిస్తోంది.
యువతలో మధుమేహం
యువత మధుమేహం బారిన పడుతోంది. ఈ వయసులో మాకెందుకు వస్తుందిలే అని నిర్లక్ష్యం చేస్తున్నారు. నగరంలోని ప్రముఖ సుగర్‌ క్లినిక్స్‌కు చెందిన 34 శాఖల్లో 2015 నవంబరు నుంచి 2016 జనవరి వరకు నిర్వహించిన ర్యాండమ్‌ బ్లడ్‌ స్క్రీనింగ్‌ క్యాంపుల ద్యారా చేసిన అధ్యయ నంలో ముఖ్యంగా మధుమేహం బారిన పడిన యువత 22.78 శాతం ఉంది. ఈ సర్వేలో మొత్తం 37,075 మందికి పరీక్షలు చేశారు. అందులో 7,839 మందికి మధుమేహం ఉన్నట్టు నిర్థారణ అయ్యింది. వయస్సుల వారీగా నాలుగు వర్గాలుగా విభజించి ఈ అధ్యయనం చేశారు. 31-40 సంవత్సరాల వారిలో 22.78 శాతం, 41-50 మధ్య 21.16 శాతం, 51-60 మధ్య 22.97 శాతం, 60 పైబడినవారిలో 29.99 శాతం మందికి ఉంది. తీసుకొనే ఆహారంలో తీవ్రమైన మార్పులు రావడం, శారీరక శ్రమ బాగా తగ్గిపోవ డం వంటి కారణాలతో గ్రామీణ, నగర పంచాయతీ ప్రాంతా లలో స్థూలకాయం, మధుమేహం పెరుగుతోంది. సాఫ్ట్‌వేర్‌ లాంటి సంస్థల్లో, అవుట్‌సోర్సింగ్‌ పేరులో పనిచేసే ఉద్యో గులు రోజుకు 12 గంటలు పనిచేస్తూ యంత్రాలుగా తయారవుతున్నారు. విపరీతమైన ఒత్తిడితో మధుమేహాన్ని కొని తెచ్చుకుంటున్నారు. మధుమేహం వల్ల స్త్రీపురుషుల్లో చాలా తక్కువ వయస్సులోనే అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. చాలా మంది యువతీయువకులు చిన్న వయస్సులోనే గుండె జబ్బులు, నాడీ జబ్బులు,కీళ్ళ నొప్పులను ఎదుర్కోవడానికి కూడా ఇదే కారణమని చెప్పవచ్చు.
భారతీయుల్లోనే ఎక్కువ
ఆసియా దేశవాసులు ముఖ్యంగా భారతీయుల శరీరాకృతిని పాశ్చాత్య దేశాల ఆకృతితో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. అమెరికన్లు, యూరోపియన్లు బరువు పెరిగిన ప్పుడు కొవ్వు శరీరమంతా ఒకే విధంగా విస్తరిన్తుంది. దీన్ని జనరలైజ్డ్‌ ఒబెసిటి అంటారు. ఆసియన్లలో ముఖ్యంగా భారతీయుల్లో కొవ్వు పొట్ట, నడుం భాగంలోనే పెరుగు తుంది. దీన్ని సెంట్రలైజ్డ్‌ ఒబెసిటి అంటారు. దీంతో ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ ఇంకా ఎక్కువౌతుంది. జనరలైజ్డ్‌ ఒబెసిటీ కంటే సెంట్రలైజ్డ్‌ ఒబెసిటి మరింత ప్రమాదం. అంతేకాక మన దేశస్తుల్లో మధుమేహానికి కారణమయ్యే జన్యువులు కూడా ఎక్కువే ఉన్నట్టు అధ్యయనాలు తెలియజేస్తున్నాయి.
ప్రపంచ దేశాల అప్రమత్తత
సాంక్రమికేతర వ్యాధులు ముఖ్యంగా మధుమేహం, రక్తపోటు, గుండెజబ్బులు, కేన్సర్‌ లాంటి వ్యాధులు మానవాళి మనుగడను ప్రమాదంలో పడేస్తున్న వాస్తవం అవగతం కాగానే ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. 2003 మేలో జరిగిన ప్రపంచ ఆరోగ్య సదస్సు ఈ వ్యాధుల కట్టడికి కార్యాచరణ రూపొందించింది. జాతీయ స్థాయి నుంచి ప్రపం చ స్థాయి దాకా భాగస్వామ్యం ఏర్పరచాలని, సమగ్ర నివారణ చర్యల దిశగా ముందడుగు వేయాలని అది నిర్ణయించింది. ఆరోగ్యకరమైన జీవనశైలి, సాంక్రమికేతర వ్యాధుల నియం త్రణపై 2011 ఏప్రిల్‌లో మాస్కోలో జరిగిన మొట్టమొదటి ప్రపంచ మంత్రిత్వశాఖల స్థాయి సదస్సు అనారోగ్య ఆహార అలవాట్లను, సోమరితనాన్ని, హానికర ఆల్కహాలు వినియోగాన్ని నిరోధించాలని పిలుపునిచ్చింది. అదే ఏడాది సెప్టెంబరులో సమావేశమైన ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ సాంక్రమికేతర వ్యాధుల అదుపుకు అనువైన వాతా వరణం కల్పిస్తామని, అంతర్జాతీయ సహకారాన్ని పెంపొంది స్తామని అభయమిచ్చింది. ఈ బాటలో ఆస్ట్రేలియా, బ్రిటన్‌, బ్రెజిల్‌ లాంటి దేశాలు అనేక చర్యలు తీసుకోవడం వల్ల మధుమేహం, రక్తపోటు లాంటి సాంక్రమికేతర జబ్బుల్ని అరికట్టగలిగాయి.
నివారణే కీలకం
మధుమేహం లాంటి సాంక్రమికేతర వ్యాధులు ఒకసారి వచ్చాక నయమయ్యే పరిస్థితి ఉండదు.ఈ వ్యాధులు దీర్ఘకాలికమైనవి, ఖరీదైన చికిత్స అవసరమైనవి. ఇప్పటికే చాలామంది పేదలు మధుమేహాన్ని గుర్తించడంలోనూ, గుర్తించిన తర్వాత మందులు వాడటంలోనూ తీవ్ర ఇబ్బం దులను ఎదుర్కొంటున్నారు. దీని దృష్ట్యా ప్రభుత్వం నివారణా చర్యల మీదనే ఎక్కువ దృష్టి సారించాలి. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని అంశాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలి. మరి కొన్ని అంశాల బాధ్యత సమాజం తీసుకోవాలి. ఈ రెండింటితో పాటు ప్రజలు కూడా ఎవరికి వారు కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడు కోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే వ్యాధి కారకం సామా జిక జీవనంలో ఇమిడిపోతుందో అప్పుడు ఆ సమస్య చికిత్స ద్వారా నయమయ్యే సాధారణ స్థాయిని దాటి ప్రజారోగ్య సమస్యగా పరిణమిస్తుంది. ఇటువంటి సమస్యలకు సామా జిక పరిష్కారం వెతుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. భారత దేశంలో ఆరోగ్య పరిరక్షణకై చేసే ఖర్చులో 82 శాతం ప్రజల జేబుల్లోంచి ఖర్చవడం గమనార్హం. ప్రజారోగ్యంపై ప్రభుత్యం చేస్తున్న వ్యయం స్థూల జాతీయాదాయంలో 1.1 శాతం మాత్రమే. ఇది కనీసం 3 శాతంగా ఉండాల్సిన ఆవశ్యకత ఉంది. సమానత్వంతో కూడిన ప్రజారోగ్యవ్యవస్థ మన లక్ష్యం. దేశ ప్రజల ఆరోగ్య పరిరక్షణకై ప్రభుత్వం ఎక్కువ మొత్తంలో ఖర్చుచేసినప్పుడు అసమానతలు లేని అభివృద్ధి సాధ్యం. తద్వారా ఆరోగ్య సూచికలు మెరగవుతాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయాలను పరిగణనలోకి తీసుకొని సమానత్వంతో కూడిన ఆరోగ్యాభివృద్ధి కోసం కృషిచేస్తాయని ఆశిద్దాం.
- డాక్టర్‌ రమాదేవి మీసరగండ
(వ్యాసకర్త జనవిజ్ఞానవేదిక ఆరోగ్య సబ్‌కమిటీ కన్వీనర్‌)
సెల్‌ : 9490300863

No comments: