Sunday, July 21, 2019

వెల్కం టు ది వరల్డ్ ఆఫ్ డయబిటిస్

మధుమేహంపై విజయపథం

Original Author Dr.Chittarvu Madhu
Updated by Dr.Hariharan ramamurthy

మధుమేహంపై విజయపథం
ఒరిజినల్ రచయిత : డా: చిత్తరువు  మధు 
నవీకరణ : డా: హరిహరన్  రామమూర్తి 

డయబిటిస్ (మధుమేహం) అంటే ఏమిటి?
దీన్ని గురించి సాధారణవ్యక్తులు తెలుసుకోవాల్సిందేమిటి వుంటుంది? 
మామూలుగా డాక్టర్ దగ్గరికి వెళ్లి మందులు రాయించుకుని వాడుకుంటే సరిపోతుంది కదా?

ఈ సందేహాలకి ముందు సమాధానం చెప్పు కోవాల్సి వుంటుంది.

నేను వృత్తి రీత్యా డాక్టర్ని ప్రవృత్తిరీత్యా రచయితని.

 కనీసం ముప్పై ఐదు  సంవత్సరాలుగా  విదేశాల్లోనూ మనదేశంలోనూ డయబిటిస్ వ్యాధిగ్రస్తులని పరీక్షించి చికిత్స చేస్తున్నవాడిని, అందుకని ఈ వ్యాధి గురించి కాస్తో కూస్తో అనుభవం వున్నట్లే చెప్పకోవచ్చు.

ఈ వ్యాధి చికిత్స ఇంకా  వ్యాధి నిర్ణయాల్లో ఈ మధ్యకాలంలో ఎన్నో మార్పులు వచ్చాయి.
  కేవలం డయబిటిస్ చికిత్సకే ప్రత్యేకత వహించిన డాక్టర్స్ ఇప్పడు ఎంతోమంది వున్నారు.

అయినా, నేను రోజూ చూసే రోగుల్లో డయబిటిస్ వున్న వారి సంఖ్య గణనీయంగా ఎక్కువయింది. కనీసం రోజూ ఒక్కరికయినా కొత్తగా డయబిటిస్ వ్యాధి వుందని కనుగొనడం జరుగుతోంది. వారితో బాటే. పూర్వంనుంచీ డయబిటిస్ వున్నవాళ్ళ చాలామందిని చూడడం జరుగుతోంది. వీళ్ళలో వ్యాధి పూర్తిగా అదుపులోకి వచ్చినవాళ్ళు, అసలు అదుపులో లేనివాళ్ళూ వివిధ రకాల కాంప్లికేషన్స్ - పాదాల మీద పుండ్లు, నరాల బలహీనత, పక్షవాతం ,గుండెపోటు కంటి చూపు సమస్యలు లాంటివి వున్నవాళ్ళు కూడా చాలామంది వుంటారు.

వ్యాధిలో ఈ విపరీతమైన పెరుగుదల నేనే కాదు. ఇతర డాక్టర్లు కూడా గమనించారని తరువాత తెలిసింది.కారణాలు ఏవైనా కానీ మనదేశంలో డయబిటిస్ వ్యాధి విపరీతంగా పెరిగిపోతోంది. ఈ రోజున భారతదేశంలో 3.5 కోట్ల మధుమేహ వ్యాధిగ్రస్తులున్నారని అంచనా. ఈ సంఖ్య 2025 సంవత్సరానికి 5.7 కోట్ల అవుతుందని వ్రాస్తున్నారు.

 మెడికల్ స్పెషలిస్ట్లు చూసేవారిలో ప్రతి ఐదో రోగీ, డయబిటిస్ వ్యాధి కలిగి వుంటున్నారు. జనరల్ డాక్టర్స్ లేదా ఫ్యామిలీ డాక్టర్స్ చూసే వారిలో ప్రతి ఏడో వ్యక్తి డయబిటిస్ రోగి! పట్టణ ప్రాంతాల్లో డయబిటిస్ వ్యాధి వూహించలేని విధంగా 14%శాతం పెరిగింది.
 ఇక ప్రపంచంలో ఇతర దేశాల్లో చూస్తే WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం డయబిటిస్ రోగుల సంఖ్య పెరుగుదల ఇలా ఉంది. సంవత్సరం 1995, 2000, 2025 (అంచనా) డయబిటిస్ రోగుల సంఖ్య 124.7, 158.9, 299.1 (మిలియన్లలో) (12కోట్ల47లక్షలు) (15 కోట్ల 39లక్షలు) (29 కోట్ల91లక్షలు) అంటే మనదేశంలో డయబిటిస్ రోగుల సంఖ్య అతివేగంగా 14% చొప్పన పెరుగుతోంది. కాబట్టే ఆరోగ్య సంస్థ భారతదేశాన్ని 'మధుమేహానికి రాజధానిగా వర్ణించింది.





 మనం ఒక డయబిటిస్ వ్యాధి యొక్క "ఎపిడమిక్ లో చిక్కుకుని వున్నాం. ఇది అంటువ్యాధి కాదు. ఏదో “టీకాలు వేసి తగ్గించగలిగే మశూచికం లాంటి వైరస్ వ్యాధి కాదు. 
అలా అని వ్యాధి వచ్చినంత మాత్రాన ప్రాణాపాయకమైనది అని నిరాశపడవలసిన భయంకరమైన మహమ్మారీ కాదు. 
ఇది శరీరంలో మెల్లగా ప్రవేశించి క్రమక్రమంగా శరీరాన్ని శిధిలం చేసి, కాంప్లికేషన్స్ ద్వారా వ్యాధిగ్రస్తుడిని కృంగదీసే లక్షణం కల పరిస్థితి. 
అందుకనే మనం డయబిటిస్ అనే అగ్ని పర్వతం మీద కూర్చుని వున్నాం అని అనను. ఇది మెల్లగా మెల్లగా మనమీద దాడిచేసే చల్లటి వ్యాధి. పూర్తిగా నివారించలేకపోయినా కనీసం చాలా దశాబ్దాలు తృప్తికరంగా కంట్రోల్ చేసుకోగలం. 

సాధారణ జీవన శైలికి ఆటంకం రాకుండా గడపగలిగే వీలున్న వ్యాధి. ఇది జీవిత విధానాన్నీ ఆహారపుటలవాట్లనీ ఇతర ఆచార వ్యవహారాల్నీ మార్చుకోవాల్సి వున్న అవసరం కల వ్యాధి. మందులు వాడడం ఒక్కటేకాదు ఆహార నియమాల్లో మార్పులు నియంత్రణ, అవగాహన చాలా అవసరం. రోజూ ఈ విషయం కనీసం ఒక్కరికైనా కొత్తగా మధుమేహ వ్యాధి వచ్చిన
వాళ్ళకి పరిచయ వాక్యాలుగా చెప్పవలసి వస్తోంది. కొత్తగా మీకు "డయబిటిస్" అంటే సుగర్ వ్యాధి వచ్చిందండీ" అనే దుర్వార్త చెవిన వేయడం, ఆ షాక్ నుంచి తేరుకునే లోపల ఆ వ్యక్తికి ఈ వ్యాధి గురించిన వివరాలు ఆహార నియమాలు చెప్పడం ఇదంతా ఒక అరగంట పని. వాళ్ళకి వచ్చే సందేహాలూ, భయాలూ నివృత్తి చేయడం వివరించి చెప్పడం ఇదంతా రోజూ చేస్తున్నదే.


మీకు డయబిటిస్ లేదా? అయితే మీ ఇంట్లో ఎవరో ఒకరికి వుండే అవకాశం వుండే ఉంటుంది.
మీకు డయబిటిస్ వుంటే, సరే సరి మీకీ పుస్తకం చికిత్స, వ్యాధి గురించి అవగాహన కలిగిస్తుంది.కాబట్టి మీరు ఎవరైనా సరే, డయబిటిస్ (మధుమేహం) అనే వ్యాధి గురించిన సమాచారం అవసరం అవుతుంది.

"సో వెల్కం టు ది వరల్డ్ ఆఫ్ డయబిటిస్"

డయాబెటిస్ గణాంకాలు

2017 లో,

సుమారు 425 మిలియన్ల పెద్దలు (20-79 సంవత్సరాలు) మధుమేహంతో నివసిస్తున్నారు; 2045 నాటికి ఇది 629 మిలియన్లకు పెరుగుతుంది/

టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారి నిష్పత్తి చాలా దేశాలలో పెరుగుతోంది.

డయాబెటిస్ ఉన్న పెద్దలలో 79% తక్కువ మరియు మధ్య-ఆదాయ దేశాలలో నివసిస్తున్నారు.

డయాబెటిస్ ఉన్నవారిలో అత్యధిక సంఖ్యలో 40 మరియు 59 సంవత్సరాల మధ్య వయస్సు వారు ఉన్నారు.

డయాబెటిస్ ఉన్న 2 (212 మిలియన్) మందిలో ఒకరు నిర్ధారణ కాలేదు.

డయాబెటిస్ 4 మిలియన్ల మరణాలకు కారణమైంది.

డయాబెటిస్ 2017 లో కనీసం 727 బిలియన్ డాలర్ల ఆరోగ్య వ్యయాన్ని కలిగించింది - పెద్దలకు మొత్తం ఖర్చులో 12%  డయాబెటిస్ పైన ఖర్చు చేస్తున్నారు .

1,106,500 మందికి పైగా పిల్లలు టైప్ 1 డయాబెటిస్‌తో నివసిస్తున్నారు

గర్భధారణ సమయంలో 21 మిలియన్లకు పైగా ప్రత్యక్ష జననాలు (7 జననాలలో 1) డయాబెటిస్ బారిన పడ్డాయి

352 మిలియన్ల మందికి టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంది