Sunday, July 31, 2016

మధుమేహం.. నిర్లక్ష్యం చేస్తే ప్రాణానికే హానికరం

మధుమేహం.. నిర్లక్ష్యం చేస్తే ప్రాణానికే హానికరం

ప్రజాశక్తి - ఏలూరు అర్బన్‌
    'మీకు తెలుసా.. ఏటా ప్రపంచవ్యాప్తంగా 350 మిల్లియన్ల జనాభా మధుమేహ వ్యాధితో బాధపడుతున్నారు. 18 ఏళ్లు నిండిన వారిలో తొమ్మిది శాతం మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఈ వ్యాధితో బాధపడేవారిలో 92 మిలియన్ల జనాభాతో చైనా ప్రథమ స్థానంలో ఉండగా, 62 మిలియన్ల బాధితులతో మన దేశం రెండో స్థానంలో ఉంది. 2030 నాటికి ఈ సంఖ్య మరింత రెట్టింపయ్యే అవకాశాలున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేయడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయాలు వెలయ్యాయి'. 
నేడు ప్రపంచాన్ని వణికిస్తున్న వ్యాధుల్లో మధుమేహం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆహార అలవాట్లలో వస్తున్న మార్పులు, పనిఒత్తిడి, వారసత్వం ఇలా పలురకాల కారణాలు ఈ వ్యాధిబారిన పడేలా చేస్తోంది. ప్రపంచ ఆరోగ్యసంస్థ ఏటా ఈనెల ఏడో తేదీన ఆరోగ్యానికి సంబంధించి ఒక ముఖ్యమైన అంశంపై ప్రపంచ ఆరోగ్యదినోత్సవాన్ని నిర్వహిస్తోంది. దీని సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతూ వస్తోంది. ఈ విధంగా 1950 నుంచి ప్రతిఏటా ఇలా కార్యక్రమాలను చేపడుతోంది. ఈ ఏడాది 'హాల్ట్‌ ది రైజ్‌ - బీట్‌ డయాబెటిస్‌' ( ఆరోగ్యకరమైన అలవాట్లు అలవర్చుకుందాం - మధుమేహ వ్యాధిని జయిద్దాం) అనే నినాదంతో అవగాహన కల్పించే కార్యక్రమం చేపట్టనుంది. ఈ సందర్భంగా మధుమేహ వ్యాధిపై ప్రజాశక్తి అందించే ప్రత్యేక కథనం
రక్తంలో గ్లూకోజ్‌ శాతం సాధారణం కన్నా ఎక్కువుగా ఉన్నా తక్కువుగా ఉన్నా దాన్ని మధుమేహం అంటారు. ఇందులో టైప్‌-1, టైప్‌-2 అని రెండు రకాలుగా చెబుతారు. టైప్‌-1 ప్రకారం ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే కణాలు ప్రాంకియస్‌లో నాశనం అవ్వడం వల్లలో శరీరంలో చక్కెరపై నియంత్రణ కోల్పోతోంది. దీనిబారిన పడిన వారు జీవితకాలం ఇన్సులిన్‌ వినియోగించాలి. టైప్‌-2 జీవనశైలి, ఆహారపు అలవాట్లు వల్ల వస్తుంది. ఇన్సులిన్‌ ఉత్పత్తి అవుతున్నా నియంత్రణ చేసే సామర్థ్యం సరిపోకపోవడం వల్ల ఈ వ్యాధి బారిన పడతారు. దీనికి మందులను వినియోగించాలి. మధుమేహం గుండె, రక్తనాళాలు, కీళ్లు, కళ్లు, నాడీవ్యవస్థలపై ప్రభావం చూపుతోంది. మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో దాదాపు 50శాతం మంది గుండె సంబంధిత వ్యాధులతో మృతిచెందుతున్నారు. అదేవిధంగా కిడ్నీలు పాడైపోవడం, చూపు మందగించడం, నరాల దెబ్బతినడం వంటి ఎన్నో రోగాల బారిన పడతారు. 
నియంత్రించండి ఇలా..
మన జీవనశైలిలో మార్పు చేసుకోవడంతో పాటుగా నిత్యం వ్యాయామం చేయడం, అధిక బరువును నియంత్రించుకోవడం, ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లను అలవర్చుకోవడం వల్ల మధుమేహ వ్యాధిని దరిచేరకుండా చూడొచ్చని వైద్యులు చెబుతున్నారు. ఆహారంలో పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువుగా తీసుకోవడం వల్ల మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చని సూచిస్తున్నారు. వీటికితోడుగా మద్యపానం, దూమపానం వంటి అలవాట్లాకు దూరంగా ఉండాలని చెబుతున్నారు. 
ప్రపంచ ఆరోగ్య సంస్థ మధుమేహ వ్యాధిపై ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రచారం చేయాలనుకున్నా ముందుగా ఆ వ్యాధికి కారణాలపై ప్రజలకు సరైన అవగాహన కల్పించాల్సి ఉంది. వ్యాధికి మూలాలను గుర్తించి దాన్ని నిర్మూలించే దిశగా చర్యలు చేపడితే దానికి తగిన ఫలితం ఉంటుందని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా కలుషిత ఆహారం, కాలుష్యం వంటి వాటి నివారణకు చర్యలు చేపట్టాలని వారు సూచిస్తున్నారు. దానికి తగినట్లుగానే అధికారులను కూడా అప్రమత్తం చేయాలని సూచిస్తున్నారు. 
వ్యాధులపై పూర్తిస్థాయి అవగాహన ముఖ్యం
రావి గోపాలకృష్ణయ్య, ప్రముఖ వైద్య సలహా నిపుణులు
వ్యాధుల నియం త్రణకు చర్యలు చేపట్టడే కాదు.. దానిపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించినప్పుడే వ్యాధులను నియంత్రించొచ్చు. ప్రభుత్వాసు పత్రుల్లో సేవలు మరింత మెరుగుపడాలి. నిరంతరం వైద్యులు అందుబాటులో ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఆరోగ్య విషయాలపై అవగాహన కల్పించాలి. 
కాలుష్య నియంత్రణ అందరి బాధ్యత
ఎం.నాగార్జున, పర్యావరణ ఇంజినీరు,
కాలుష్య నియంత్రణ మండలి 
వాతావరణంలో కార్బ న్‌డై ఆక్సైడ్‌ ఎక్కువుగా కలవడం వల్ల ఓజోన్‌ పొర దెబ్బతింటోంది. దీనివల్ల ప్రజలు రకరకాల వ్యాధుల బారిన పడుతున్నారు. వాతావరణం కలుషితం కాకుండా చూడల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. ఈ విషయాన్ని గుర్తించాలి.

No comments: