Sunday, July 31, 2016

ఆహార నియమాలు పాటించాలి

ఆహార నియమాలు పాటించాలి
పిజ్జా, బర్గర్‌, ఫైడ్‌రైస్‌, న్యూడిల్స్‌ వంటి ఫుడ్స్‌, నిల్వచేసిన ఆహార పదార్థాలు, వేపుళ్లు, మసాలా పుడ్స్‌ తినడం ద్వారా ఒబిసిటి థైరాయిడ్‌, సుగర్‌, అధికబరువు వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. ఒక మనిషి రోజుకి 1600 నుంచి 1800 క్యాలరీలు ఆహార పదార్థాలుగా తీసుకోవాల్సి ఉంది. 2000 నుంచి 2,500 క్యాలరీలు తీసుకుంటున్నారు. 
శారీరక శ్రమ, వ్యాయామం చేయాలి
ప్రస్తుత సమాజంలో బిజిబిజీగా ఉండే ప్రజలు శారీరక శ్రమ, వ్యాయామం చేయడానికి విస్మరిస్తున్నారు. గతంలో పురుషులు, మహిళలు రోజుకు కొంత సమయాన్ని తోటల్లో మొక్కలు పెంపకం, ఇళ్లల్లో తేలికపాటి పనులు చేస్తూ శారీరకంగా శ్రమించేవారు. ప్రజల జీవనవిధానంలో మార్పులు, యాంత్రికరణతో శారీరక శ్రమ జోలికి పోవడం లేదు. ఆధునిక కాలంలో వ్యాయామం చేయడానికి సరిగ్గా సమయం దొరకడం లేదు. వ్యాధులబారిన పడకుండా ఉండాలంటే ప్రతి మనిషీ రోజుకు 30 నుంచి 40 నిమిషాల పాటు నడవాలి. ప్రజలు వారానికి ఐదురోజులు 45 నిమిషాలు పాటు నడవాలని వైద్యులు సూచిస్తున్నారు. 
మానసిక ఒత్తిడికి దూరంగా
ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే మానసిక ఒత్తిడికి దూరంగా ఉండాలి. ఆధునిక కాలంలో మానసిక ఒత్తిడి వల్ల రక్తపోటు, మధుమేహం, గుండెపోటు, ఆయాసం, థైౖరాయిడ్‌ వంటి వ్యాధుల బారిన ప్రజలు పడుతున్నట్లు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. మానసిక ఒత్తిడిలకు దూరంగా ఉండాలంటే యోగా, మెడిటేషన్‌ చేయాలి. 
మధుమేహ వ్యాధిపై అవగాహన
ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది మధుమేహంపై అవగాహనకు పిలుపు నిచ్చారు. మధుమేహ వ్యాధి లక్షణాలు, వ్యాధి నిర్ధారణ, చికిత్సపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం కల్పించి తద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావడం ద్వారా మధుమేహ వ్యాధిని నియంత్రించొచ్చు. మధుమేహ వ్యాధి భారం, దాని పరిణామాలు, వ్యాధి పరివీక్షణ, నివారణ మార్గాలు, మధుమేహ రోగులకు సమర్థ వంతమైన చికిత్సలపై ప్రభుత్వాలను సన్నద్ధులను చేయాలి.
శారీరక శ్రమ, వ్యాయామం తప్పనిసరి
ప్రస్తుతం కాలంలో ప్రజలు బిజిగా ఉంటున్నారు. వారి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. శారీరక శ్రమ, వ్యాయామం చేయడం మానసిక ఒత్తిడుల నుంచి దూరంగా ఉండడం ద్వారా భావితరాలకు ఆరోగ్యాన్ని అందించొచ్చు. తల్లిదండ్రులు, పిల్లలు మధ్యంతరం రాకుండా ఉండాలంటే ప్రతి కుటుంబం రోజుకి గంటసేపు కుటుంబ సభ్యులతో గడపాలి. ప్రతి కుటుంబం ఒక మొక్కను నాటాలి. భావి తరాలు ఆరోగ్యంగా ఉంటే దేశం ఆరోగ్యంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. 
డాక్టర్‌ మోకా ప్రసాదరావు, వైద్య నిపుణులు, రాజోలు

మధుమేహం.. నిర్లక్ష్యం చేస్తే ప్రాణానికే హానికరం

మధుమేహం.. నిర్లక్ష్యం చేస్తే ప్రాణానికే హానికరం

ప్రజాశక్తి - ఏలూరు అర్బన్‌
    'మీకు తెలుసా.. ఏటా ప్రపంచవ్యాప్తంగా 350 మిల్లియన్ల జనాభా మధుమేహ వ్యాధితో బాధపడుతున్నారు. 18 ఏళ్లు నిండిన వారిలో తొమ్మిది శాతం మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఈ వ్యాధితో బాధపడేవారిలో 92 మిలియన్ల జనాభాతో చైనా ప్రథమ స్థానంలో ఉండగా, 62 మిలియన్ల బాధితులతో మన దేశం రెండో స్థానంలో ఉంది. 2030 నాటికి ఈ సంఖ్య మరింత రెట్టింపయ్యే అవకాశాలున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేయడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయాలు వెలయ్యాయి'. 
నేడు ప్రపంచాన్ని వణికిస్తున్న వ్యాధుల్లో మధుమేహం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆహార అలవాట్లలో వస్తున్న మార్పులు, పనిఒత్తిడి, వారసత్వం ఇలా పలురకాల కారణాలు ఈ వ్యాధిబారిన పడేలా చేస్తోంది. ప్రపంచ ఆరోగ్యసంస్థ ఏటా ఈనెల ఏడో తేదీన ఆరోగ్యానికి సంబంధించి ఒక ముఖ్యమైన అంశంపై ప్రపంచ ఆరోగ్యదినోత్సవాన్ని నిర్వహిస్తోంది. దీని సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతూ వస్తోంది. ఈ విధంగా 1950 నుంచి ప్రతిఏటా ఇలా కార్యక్రమాలను చేపడుతోంది. ఈ ఏడాది 'హాల్ట్‌ ది రైజ్‌ - బీట్‌ డయాబెటిస్‌' ( ఆరోగ్యకరమైన అలవాట్లు అలవర్చుకుందాం - మధుమేహ వ్యాధిని జయిద్దాం) అనే నినాదంతో అవగాహన కల్పించే కార్యక్రమం చేపట్టనుంది. ఈ సందర్భంగా మధుమేహ వ్యాధిపై ప్రజాశక్తి అందించే ప్రత్యేక కథనం
రక్తంలో గ్లూకోజ్‌ శాతం సాధారణం కన్నా ఎక్కువుగా ఉన్నా తక్కువుగా ఉన్నా దాన్ని మధుమేహం అంటారు. ఇందులో టైప్‌-1, టైప్‌-2 అని రెండు రకాలుగా చెబుతారు. టైప్‌-1 ప్రకారం ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే కణాలు ప్రాంకియస్‌లో నాశనం అవ్వడం వల్లలో శరీరంలో చక్కెరపై నియంత్రణ కోల్పోతోంది. దీనిబారిన పడిన వారు జీవితకాలం ఇన్సులిన్‌ వినియోగించాలి. టైప్‌-2 జీవనశైలి, ఆహారపు అలవాట్లు వల్ల వస్తుంది. ఇన్సులిన్‌ ఉత్పత్తి అవుతున్నా నియంత్రణ చేసే సామర్థ్యం సరిపోకపోవడం వల్ల ఈ వ్యాధి బారిన పడతారు. దీనికి మందులను వినియోగించాలి. మధుమేహం గుండె, రక్తనాళాలు, కీళ్లు, కళ్లు, నాడీవ్యవస్థలపై ప్రభావం చూపుతోంది. మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో దాదాపు 50శాతం మంది గుండె సంబంధిత వ్యాధులతో మృతిచెందుతున్నారు. అదేవిధంగా కిడ్నీలు పాడైపోవడం, చూపు మందగించడం, నరాల దెబ్బతినడం వంటి ఎన్నో రోగాల బారిన పడతారు. 
నియంత్రించండి ఇలా..
మన జీవనశైలిలో మార్పు చేసుకోవడంతో పాటుగా నిత్యం వ్యాయామం చేయడం, అధిక బరువును నియంత్రించుకోవడం, ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లను అలవర్చుకోవడం వల్ల మధుమేహ వ్యాధిని దరిచేరకుండా చూడొచ్చని వైద్యులు చెబుతున్నారు. ఆహారంలో పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువుగా తీసుకోవడం వల్ల మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చని సూచిస్తున్నారు. వీటికితోడుగా మద్యపానం, దూమపానం వంటి అలవాట్లాకు దూరంగా ఉండాలని చెబుతున్నారు. 
ప్రపంచ ఆరోగ్య సంస్థ మధుమేహ వ్యాధిపై ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రచారం చేయాలనుకున్నా ముందుగా ఆ వ్యాధికి కారణాలపై ప్రజలకు సరైన అవగాహన కల్పించాల్సి ఉంది. వ్యాధికి మూలాలను గుర్తించి దాన్ని నిర్మూలించే దిశగా చర్యలు చేపడితే దానికి తగిన ఫలితం ఉంటుందని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా కలుషిత ఆహారం, కాలుష్యం వంటి వాటి నివారణకు చర్యలు చేపట్టాలని వారు సూచిస్తున్నారు. దానికి తగినట్లుగానే అధికారులను కూడా అప్రమత్తం చేయాలని సూచిస్తున్నారు. 
వ్యాధులపై పూర్తిస్థాయి అవగాహన ముఖ్యం
రావి గోపాలకృష్ణయ్య, ప్రముఖ వైద్య సలహా నిపుణులు
వ్యాధుల నియం త్రణకు చర్యలు చేపట్టడే కాదు.. దానిపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించినప్పుడే వ్యాధులను నియంత్రించొచ్చు. ప్రభుత్వాసు పత్రుల్లో సేవలు మరింత మెరుగుపడాలి. నిరంతరం వైద్యులు అందుబాటులో ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఆరోగ్య విషయాలపై అవగాహన కల్పించాలి. 
కాలుష్య నియంత్రణ అందరి బాధ్యత
ఎం.నాగార్జున, పర్యావరణ ఇంజినీరు,
కాలుష్య నియంత్రణ మండలి 
వాతావరణంలో కార్బ న్‌డై ఆక్సైడ్‌ ఎక్కువుగా కలవడం వల్ల ఓజోన్‌ పొర దెబ్బతింటోంది. దీనివల్ల ప్రజలు రకరకాల వ్యాధుల బారిన పడుతున్నారు. వాతావరణం కలుషితం కాకుండా చూడల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. ఈ విషయాన్ని గుర్తించాలి.

మధుమేహం గురించి మ‌ద‌న‌ప‌డొద్దు‌..!

మధుమేహం గురించి మ‌ద‌న‌ప‌డొద్దు‌..!


                   మధుమేహం ఉందని తెలియగానే దిగులుపడతాం. ఆ దిగులు, ఆందోళన, టెన్షన్లే ఈ వ్యాధిని మరింత పెంచుతాయి కానీ, తగ్గించవు. ఈ వ్యాధి గురించిన పూర్తి చికిత్సా విధానం తెలియకపోవడం వల్లే ఇలా ఆందోళనపడటం సహజం. అది గ్రహించిన వి.జి.ఆర్‌ డయాబెటిస్‌ స్పెషాలిటీస్‌ హాస్పిటల్‌ డాక్టర్‌ కె. వేణు గోపాల్‌రెడ్డి గత కొద్ది సంవత్సరాలుగా ఈ వ్యాధితో బాధపడే వారికోసం, వారంతా ఆరోగ్యంగా జీవించడం కోసం కొన్ని అవగాహనా కార్యక్రమాలను రూపొందించారు.
షుగర్‌ను ఎలా సమర్థవంతంగా నియంత్రించాలి? ఇది ప్రాణాంతకమవకుండా ఏం చేయాలి? షుగర్‌వల్ల దెబ్బతినే అవయవాలను ఎలా కాపాడుకోవాలి? అందుకు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఆహార నియమాలు ఎలా ఉండాలనే అతి ముఖ్యమైన విషయాలు తెలియజెప్పారు. ఆ వివరాలు 'జీవన' పాఠకులకు ప్రత్యేకం.
మధుమేహ వ్యాధి ఇటీవల మన దేశంలో బాగా పెరిగినట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. అంతేకాకుండా మనదేశంలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రగామిగా ఉందని, హైదరాబాద్‌ మధుమేహ నగరంగా ముందుందుని సర్వే తెలుపుతోంది. చాపకింద నీరులా మధుమేహం వ్యాప్తి చెందుతోంది. ప్రపంచానికే మధుమేహ రాజధానిగా మనదేశం ప్రసిద్ధికెక్కింది. సుమారుగా 50 మిలియన్లకి పైగా ఇప్పటికే మధుమేహం బారిన పడ్డారు. ఈ సంఖ్య 2030 నాటికి 80 మిలియన్లకి పెరగవచ్చని ఒక అంచనా.
దురదృష్టం కొద్దీ మధుమేహ వ్యాధి లక్షణాలు అంతగా ఇబ్బంది పెట్టేవి కాదు. అందుకే దానిని అంతగా పట్టించుకోం. నష్టం జరిగిన తరువాతగానీ అసలు వాస్తవం బయటపడదు. కాబట్టే దీనిని 'సైలెంట్‌ కిల్లర్‌' అంటారు.
మధుమేహం ఉందనేది, ఉన్నవాళ్లకు 50 శాతం మందికి తెలియనే తెలియదు. తెలుసుకున్న వాళ్లలో 50 శాతం మంది మాత్రమే తగిన వైద్యాన్ని తీసుకుంటున్నారు. మధుమేహం వల్ల నరాలు, గుండె, ఊపిరితిత్తులు, రక్తనాళాలు, మూత్ర పిండాలు, కళ్లు, పాదాల్లాంటి ఎన్నో అవయవాలు దెబ్బతింటాయి. కాబట్టి మధుమేహం గురించి అందరూ తప్పక తెలుసుకొని, దాని నుంచి రక్షణ పొందాలి.
రావడానికి ఎవరికి అవకాశం ఉంది?
కుటుంబంలో తల్లిదండ్రులకు ముధుమేహం ఉంటే
అధిక బరువు, ఊబకాయం ఉన్నవాళ్లు
ఎక్కువ శ్రమలేని జీవితాన్ని గడుపుతున్న వాళ్లు
ఎక్కువ ఒత్తిడికి గురవుతున్న వాళ్లు
కొలెస్ట్రాల్‌ (లేక) ట్రైగ్లిజరైడ్‌ స్థాయి ఎక్కువగా ఉన్నవాళ్లు
నాలుగు కిలోల బరువున్న శిశువుకు జన్మనిచ్చిన స్త్రీ
స్టెరాయిడ్‌ మందులు తీసుకునేవాళ్లకు
రిస్క్‌ ఎలా ఉంటుంది?
తల్లిదండ్రులిద్దరికీ మధుమేహం ఉంటే-99%
తల్లిదండ్రులో ఒకరికి మధుమేహం ఉండి రెండోవాళ్ల
బంధువులెవరికైనా మధుమేహం ఉంటే -75%
బంధువులెవరికైనా మధుమేహం ఉంటే - 50%
తల్లిదండ్రులకుగాక దగ్గర బంధువులకెవరికైనా
మధుమేహం ఉంటే -25%
చేయించుకోవలసిన పరీక్షలు
ఫాస్టింగ్‌, పోస్ట్‌లంచ్‌ బ్లడ్‌షుగర్‌ - నెలకోసారి
గ్లైకోజిలేటెడ్‌ హీమోగ్లోబిన్‌ - 2-3 నెలలకోసారి
లిఫిడ్‌ప్రొఫైల్‌ - సంవత్సరానికి ఒక్కసారి
కిడ్నీ పరీక్షలు - యూరియా, క్రియాటినైన్‌,
ఆరు నెలలకు ఒకసారి
మైక్రో ఆల్బుమిన్‌ - సంవత్సరానికి ఒక్కసారి
గుండె, లివర్‌, పాదాలను - సంవత్సరానికి ఒక్కసారి
కన్ను- రెటీనా గురించి - సంవత్సరానికి ఒక్కసారి
కేవలం బ్లడ్‌ షుగర్‌ పరీక్షలు చేయిస్తే చాలదు. ప్రతీ ఏడాది కళ్లు, కిడ్నీలు, గుండె, కాలేయం, నరాలు, పాదాలు పరీక్ష చేయించుకుంటూ జాగ్రత్తపడాలి.
ఒకటి మాత్రం అందరూ గుర్తుంచుకోవాలి మధుమేహం అదుపులో లేనివాళ్లలో ఈ అవయవాలు నిశబ్ధంగా దెబ్బతింటాయి. అది బయటపడేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.
వ్యాధి లక్షణాలు
తరచుగా మూత్ర విసర్జన చేయడం
అతిగా దాహం వేయడం
అతిగా ఆకలి వేయడం
బరువు తగ్గిపోవడం
చూపు మందగించడం
పుండ్లు త్వరగా మానకపోవటం
బాగా నీరసం, నిస్సత్తువ
మర్మావయవాల దగ్గర ఫంగల్‌ ఇన్ఫెక్షన్స్‌ రావడం
తెలుసుకోవడానికి
ఫాస్టింగ్‌ బ్లడ్‌ షుగర్‌ -126mg/dl ఉన్నా అంతకన్నా ఎక్కువగా ఉన్నా మధుమేహం ఉన్నట్లు గుర్తించాలి.
గ్లూకోజ్‌ టాలరెన్స్‌ టెస్ట్‌లో బ్లడ్‌షుగర్‌ 75mg  గ్లూకోజ్‌ తీసుకున్న రెండుగంటలకు 200mg/dl ఉన్నా, అంతకన్నా ఎక్కువగా ఉన్న మధుమేహం ఉన్నట్లు గుర్తించాలి.
అలాగే రాండమ్‌ బ్లడ్‌ షుగర్‌ 200mg/dl ఉన్నా, అంతకన్నా ఎక్కువగా ఉన్నా మధుమేహం ఉన్నట్లు గుర్తించాలి.
ఫాస్టింగ్‌ బ్లడ్‌షుగర్‌ 100`125 mg/dl మధ్య, ఆహారం తీసుకున్న తరువాత 140 mg/dl- 199 mg/dl ఉన్నవాళ్లని ప్రీ డయాబెటిక్‌ స్టేజీలో ఉన్నట్లుగా గుర్తించవచ్చు. వీళ్లకు భవిష్యత్‌లో షుగర్‌ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.
గుండెజబ్బులు
మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో 50-60 శాతం మంది గుండె, రక్తనాళాలకు సంబంధించిన వ్యాధులతో భాదపడుతున్నట్లు పరీక్షలు తెలుపుతున్నాయి. టైప్‌-2 డయాబెటిస్‌తో బాధపడుతూ మరణించిన వాళ్లల్లో మూడు వంతులు గుండెనాళాలకు సంబంధించిన వ్యాధుల కారణాల వల్లే అని పరిశోధనల్లో తేలింది.
మూత్రపిండాలు
మధుమేహం ఎక్కువ కాలం అదుపులో లేకుండా ఉంటే ఆ ప్రభావం మూత్రపిండాల మీద పడవచ్చు. మూత్రపిండాలకు డయాబెటిక్‌ నెఫ్రోపతి వస్తుంది. ఇది వస్తే క్రమంగా మూత్రపిండాలు పాడైపోతాయి. మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవడంతోనే డయాబెటిక్‌ నెఫ్రోపతిని అదుపులో ఉంచుకోవచ్చు.
పాదాలు
మధుమేహం వల్ల క్రమంగా రక్తనాళాలే కాదు, నరాలూ దెబ్బతింటాయి. ముఖ్యంగా శరీరం చివర ఉండే నరాలు దెబ్బతింటాయి. కాబట్టి మధుమేహమంటే పెరిఫెరల్‌ న్యూరోపతి వస్తుందని భయపడుతుంటారు. పాదాలలో, అరచేతుల్లో ఉన్న నరాలు, దెబ్బతినే ముందు తిమ్మిర్లు వస్తాయి. ఆ తర్వాత స్వర్మజ్ఞానం క్రమంగా తగ్గిపోతుంది. అలాంటప్పుడు పాదాలలో ఏమి గుచ్చుకున్నా తెలీదు.
కన్ను
మధుమేహం అదుపులో లేనివారిలో ముందుగా కన్ను వెనుకఃభాగంలో ఉండే రెటీనా అనే పొరలోని సూక్ష్మ రక్తనాళాలు దెబ్బతినటం జరుగుతుంది. దానివలన చివరకు అంధత్వం కూడా సంభవించవచ్చు.
చికిత్స
మధుమేహం వ్యాధి చికిత్సలో నాలుగు ముఖ్యమైన అంశాలను మనం తప్పకుండా పాటించాలి. అందులో
మొదటిది:
సరైన ఆహార నియమాలను పాటించడం.
రెండవది:
రెగ్యులర్‌గా వ్యాయమం చేయడం.
మూడవది:
క్రమం తప్పకుండా మందులు వేసుకోవడం.
నాల్గవది:
వ్యాధి గురించి పూర్తి అవగాహన కలిగి ఉండటం.
పైన చెప్పిన ఈ నాలుగు అంశాలను చక్కగా పాటించడం ద్వారా మనం మధుమేహం వ్యాధిని చక్కగా అదుపులో ఉంచుకోగలం. దీనివల్ల ఎక్కువకాలం ఆరోగ్యంగా జీవించడానికి వీలు కలుగుతుంది.

http://www.prajasakti.com/Content/1655505