Sunday, July 31, 2016

కిడ్నీ కేర్ మీ చేతుల్లో‌నే

కిడ్నీ కేర్ మీ చేతుల్లో‌నే


               మూత్రపిండాలు (కిడ్నీ) శరీరంలో రక్తాన్ని శుద్ధి చేస్తాయి. రసాయనాలు, ఇతర హానికర పదార్థాలు, ద్రవాలన్నీ ఈ వడపోత ప్రక్రియ ద్వారా బయటకు వెళ్లిపోతాయి. అంతటి ప్రాధాన్యం కలిగిన కిడ్నీలో సమస్య వచ్చిందంటే చాలు జీవితకాలం పూర్తయినట్టేనని చాలామంది భావిస్తారు. ఇది కేవలం ఒక అపోహ మాత్రమే. తగిన చికిత్సలు చేయించుకుంటే ఈ వ్యాధిగ్రస్తులు అందరిలాగే సంపూర్ణ జీవితాన్ని కొనసాగించవచ్చు. వయస్సు మీద పడిన తర్వాత వచ్చే ఈ సమస్యలను ఒక పద్ధతి లేని ఆహార నియమాల వల్ల యుక్త యస్సులో కొని తెచ్చుకుంటున్నారని వైద్యులు చెబుతున్నారు. అసలు మూత్రపిండాల వ్యాధులు ఏవిధంగా సోకుతాయి? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వ్యాధి నుంచి ఎలా బయటపడాలి? ఆ క్రమంలో అందుబాటులోకి వచ్చిన నూతన చికిత్సలు ఏమిటి? అన్న విషయాలు ఈ వారం డాక్టర్స్‌ స్పెషల్‌లో తెలుసుకుందాం.
లక్షణాలు
కిడ్నీ వ్యాధి రావడానికి ముందుగా శరీరంలో కొన్ని ముఖ్యమైన సూచనలు కనిపిస్తాయి. వాటిని ప్రాతిపదికగా తీసుకుని వ్యాధి ఉన్నదీ లేనిదీ నిర్ధారణ చేసుకోవచ్చు. కాళ్లు, ముఖం వాపు, మూత్రవిసర్జన తగ్గడం, ఆకలి లేకపోవడం, ఉదయం నిద్ర లేచిన వెంటనే కడుపులో వికారంగా ఉండి వాంతి వచ్చినట్టుగా ఉండడం, పగటిపూటా ఇలాగే ఉండడంతోపాటు మగతగా ఉంటుంది. పగలు నిద్ర ఎక్కువగా రావడం, రాత్రిపూట నిద్ర పట్టకపోవడం కిడ్నీ వ్యాధి లక్షణాలు. ఇలా ఉన్నప్పుడు బ్లడ్‌ యూరియా క్రేట్‌ పరీక్ష చేయడం ద్వారా వ్యాధి ఉన్నదీ లేనిదీ తెలుసుకోవచ్చు. కిడ్నీ ద్వారా బయటకు వెళ్లవలసిన వ్యర్థ పదార్థాలు ఎక్కువ పరిమాణంలో ఉన్నాయా లేదా అన్నది ఈ పరీక్ష ద్వారా తేలిపోతుంది. ఒకవేళ వ్యర్థ పదార్థాలు ఎక్కువ పరిమాణంలో ఉన్నాయంటే దాన్ని కిడ్నీ వ్యాధిగా పరిగణించాలి. ఆ తర్వాత అల్ట్రాసౌండ్‌ స్కాన్‌, హిమోగ్లోబిన్‌ నివేదిక పరిశీలించి ఈ సమస్య దీర్ఘకాలంగా ఉందా లేక కొత్తగా వచ్చిందా అని తెలుసుకోవచ్చు. వ్యాధి ప్రాథమిక దశలో ఉంటే మందులతో నయం చేసుకోవచ్చు. మందులతో నయం కానప్పుడు దాని తీవ్రత పెరుగుతుంది. కొందరికి అధిక రక్తపోటు (హైబీపీ), మధుమేహం (డయాబెటిస్‌) దీర్ఘకాలికంగా ఉన్నప్పుడు వాటి ప్రభావం కిడ్నీలపై నెమ్మదిగా పడి వ్యాధి తీవ్రతరమవుతుంది.

రక్తశుద్ధి ఎప్పుడంటే...
ఈ వ్యాధికి సంబంధించిన లక్షణాలు ఉన్నాయా లేదా అని ముందుగా నిర్ధారించుకున్న తర్వాత చికిత్స మొదలవుతుంది. వ్యాధి ప్రాథమిక దశలో ఉంటే మందులు, ఆహార నియంత్రణ ద్వారా నివారించుకోవచ్చు. కాళ్లవాపు, ఆయాసం వంటి లక్షణాలు ఎక్కువగా ఉండి మందులు వాడుతున్నప్పటికీ మూత్ర పరిమాణం పెరగని పక్షంలో రక్తశుద్ధి (డయాలసిస్‌) చేయాల్సి వస్తుంది. ఆహార నియంత్రణతో శరీరంలో పొటాషియం పరిమాణం తగ్గని పక్షంలో అది గుండెపై ప్రభావం చూపుతుంది. మూత్రంలో యాసిడ్‌, యూరియా పరిమాణాలు పెరుగుతూ ఉంటే డయాలసిస్‌ తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది.
వ్యాధి ఎందుకొస్తుందంటే...
కిడ్నీ సమస్యలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి తాత్కాలికమైనది కాగా రెండోది దీర్ఘకాలికంగా ఉండేది. తాత్కాలిక సమస్యకు అనవరసంగా పెయిన్‌ కిల్లర్స్‌ వాడడం, యాంటీ బయాటిక్‌లు అవసరమైనా, లేకపోయినా దీర్ఘకాలంగా తీసుకోవం, డీహైడ్రేషన్‌ వంటివి వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయడం లాంటి ప్రధాన కారణాల వల్ల కిడ్నీల్లో సమస్యలు ఏర్పడతాయి. ఇటువంటి వాటిని అరికట్టడం ద్వారా వాటిని ఆరోగ్యవంతంగా ఉంచుకునే వీలుంటుంది. మధుమేహం, హైపర్‌ టెన్షన్‌ వల్ల దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి ఏర్పడుతుంది. ఈ వ్యాధిగ్రస్తుల్లో అరవై నుంచి డభై శాతం మంది మధుమేహం కారణంగా సమస్యను ఎదుర్కొంటున్న వారే. మధుమేహ వ్యాధిని అదుపులో ఉంచుకోవడం వల్ల కిడ్నీ సమస్యలు రాకుండా నిరోధించకపోయినప్పటికీ కొంతవరకు జాప్యం చేయవచ్చు. ఒకవేళ వ్యాధి సోకినా డయాలసిస్‌ వరకు వెళ్లకుండా చేసుకునే అవకాశం ఉంటుంది.
ఇవీ జాగ్రత్తలు
కుటుంబంలో ఎవరికైనా మధుమేహ వ్యాధి ఉన్నా కుటుంబ సభ్యులంతా ఏడాదికి ఒకసారి రక్తపరీక్షలు చేయించుకోవాలి.
మధుమేహం, హైబీపీ ఉంటే వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడడంతోపాటు ఆహార నియంత్రణ పాటించాలి.
మందులు క్రమం తప్పకుండా వేసుకుంటూ షుగర్‌ను అదుపులో ఉంచుకోవాలి.
తద్వారా కిడ్నీ సమస్యలనుు కొంతకాలం వాయిదా వేయవచ్చు.
షుగర్‌ను నియంత్రించుకోని పక్షంలో వృద్ధాప్యంలో రావాల్సిన కిడ్నీ సమస్యలు ముందుగానే వచ్చే అవకాశం ఉంటుంది.
క్యాలరీలు అధికంగా ఉండే పిజ్జాలు, బర్గర్లు వంటి వాటికి దూరంగా ఉండాలి.
ఆల్కహాల్‌, ధూమపానం వంటి అలవాట్లు మానేయాలి.
నిత్యం వ్యాయామం చేయడం, ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించడంతోపాటు రోజుకు రెండు లీటర్ల నీరు తాగడం ద్వారా కిడ్నీ సమస్యలు రాకుండా అరికట్టవచ్చును.
కిడ్నీ శరీరంలో మురుగును వదిలించే వ్యవస్థ వంటిది. ఆ మురుగు బయటకు పోకుండా లోపల ఉండిపోతే శరీరం మొత్తం పాడైపోతుంది. శరీరంలో రక్తాన్ని శుద్ధి చేయడం, సోడియం, పొటాషియం తదితర లవణాలను నియంత్రించడం మూత్రపిండాల విధి. అందువల్ల బీపీ, రక్తహీనత వంటివి ఉన్నప్పుడు కిడ్నీ పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.

రెండు విధాలుగా డయాలసిస్‌ 
కిడ్నీ వ్యాధి సోకిన రోగులకు ఒక్కోసారి డయాలసిస్‌ (రక్తశుద్ధి) అవసరమవుతుంది. ఇది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి హిమో డయాలసిస్‌, రెండోది పెరిటోనియల్‌ డయాలసిస్‌.
హిమో డయాలసిస్‌
ఇది చేయించుకునే రోగులకు బీపీ సాధారణ స్థాయిలో ఉండాలి.
వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న రోగుల్లో బీపీ తక్కువగా ఉంటుంది.
ఇటువంటి రోగులకు సీఆర్‌ఆర్‌టీ (కంటిన్యూయస్‌ రీనల్‌ రీప్లేస్‌మెంట్‌ థెరపి) అనే ఆధునిక యంత్రం ద్వారా డయాలసిస్‌ చేయవచ్చు.
ఈ చికిత్స దశల్లో కిడ్నీ విఫలమైతే దాని మార్పిడి విషయాన్ని రోగులకు చెప్పాల్సి ఉంటుంది.
పెరిటోనియల్‌ డయాలసిస్‌
పెరిటోనియల్‌ డయాలసిస్‌కు మరో పేరే హోం డయాలసిస్‌.
రోగులు హిమో డయాలసిస్‌ సెంటర్‌కు దూరంగా ఉన్న పక్షంలో
పెరిటోనియల్‌ డయాలసిస్‌ విధానాన్ని ఉపయోగిస్తారు.
ఈ విధానంలో యంత్రం అవసరం ఉండదు.
ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరమూ ఉండదు.
పచ్చకామెర్లు ఉన్న వారికి ఈ విధానం ఎంతో ఉపయోగకరంగా
ఉంటుంది.
దీనికి రక్తంతో సంబంధం ఉండదు.
హిమో డయాలసిస్‌లో బీపీ హెచ్చుతగ్గులు ఉండడం వల్ల రికవరీ
అవకాశాల్లో పది నుంచి ఇరవై శాతం వరకు రిస్క్‌ ఉంటుంది.
ఆరేడు గంటలకు ఒకసారి మూత్రంతో నిండిపోయిన బ్యాగ్‌ను
మారుస్తుండాలి.
ఇది నెమ్మదిగా పనిచేయడంతో బీపీలో హెచ్చుతగ్గులు వచ్చే అవకాశం లేదు.
హిమో డయాలసిస్‌ కంటే ఇది ఎంతో ఉపయోగకరమైనది.
- డాక్టర్‌ కె.ఎస్‌.నాయక్‌, 
నెఫ్రాలజిస్ట్‌, 
హైదరాబాద్‌.